హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీల అవసరాలపై ప్రణాళికలు రూపొందించడానికి పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ (పీపీసీ)లో భాగంగా ఈ నెల 27 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు.
ఈ మేరకు పంచాయతీరాజ్ డైరెక్టర్ హన్మంతరావు జిల్లాల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు మంగళవారం ఆదేశాలను జారీ చేశారు. 2023-24 సంవత్సరంలో అందుబాటులో ఉన్న నిధులతో చేపట్టే పనులు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామ అవసరాలకు ప్రాధాన్య క్రమంలో పనులను నిర్ణయించి ప్రణాళిక రూపొందించిన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ)ను గ్రామసభలో ఆమోదించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సబ్కి యోజన- సబ్కా వికాస్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం చేపట్టింది.