నిర్మల్ : జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గురువారం నిర్మల్ లో వడ్ల కొనుగోలు సంబంధించి అధికారులు, మిల్లర్లు, లారీ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం వడ్లను కొనుగోలు చేయడానికి నిరాకరించిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టపోకుండా కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్వింటాకు రూ. 1960 చొప్పున చెల్లించి పంటను సేకరించాలని గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి సూచించారు. లారీ యజమానులు పంటను తరలించడంలో జాప్యం చేయవద్దని మిల్లర్లు సైతం ఇందుకు సహకరించాలని మంత్రి కోరారు.