బీర్కూర్, జూన్ 15: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండివైఖరి అవలంబించినా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేసిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ శివారులో వాగుపై రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భం గా స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజలు, రైతులకు రవాణాసౌకర్యార్థం సీఎం కేసీఆర్ సహకారంతో పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల ద్వారా వాగులపై వంతెనలను నిర్మిస్తున్నామని చెప్పారు. నిజాంసాగర్ 25వ నంబరు కాలువకు రూ.15 కోట్ల ఖర్చుతో సిమెంట్ లైనింగ్ చేయించామని, దీంతో చివరి ఆయకట్టు వరకు నీరందుతుందని వెల్లడించారు. రైతుల కోరిక మేరకు నిజాంసాగర్ నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎక్లాస్పూర్లో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనాథ ఆశ్రమాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి ప్రారంభించారు.