హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ తుదిదశకు చేరాయి. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 7,007 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇందులో ధాన్యం కొనుగోలు పూర్తయిన 4300 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ఇప్పటివరకు 58 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీని విలువ రూ.11,800 కోట్లు. సంక్రాంతి వరకు కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
మరో 5-8 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. ఈ జిల్లా నుంచి 5.95 లక్షల టన్నులు, కామారెడ్డిలో 4.84 లక్షల టన్నులు, మెదక్లో 4.02 లక్షల టన్నులు, నల్లగొండలో 3.96 లక్షల టన్నులు, సిద్దిపేటలో 3.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.