హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో వ్యవసాయానికి ప్రమాదం పొంచి ఉందని జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐకార్) హెచ్చరించింది. భారీగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ వాయువుల కారణంగా వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకొంటున్నాయని, ఇది ఇలాగే కొనసాగితే మరో 20 ఏండ్లలో వ్యవసాయంపై భారీ ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించింది. ఇది అనేక అంశాలపై ప్రభావం చూపనుందని పేర్కొంది. వర్షాలు తగ్గి, కరువు కోరల్లో చిక్కుకోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. వాతావరణ మార్పులు, వ్యవసాయంపై కలిగే ప్రభావంపై సర్వే చేసిన ఐకార్ తన నివేదికను తాజాగా విడుదల చేసింది.
ఈ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. వాతావరణ మార్పుల కారణంగా పంటల దిగుబడి, నాణ్యత తగ్గుతుందని పేర్కొన్నది. అలాగే, ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని, తద్వారా వర్షపాతం తగ్గుతుందని తెలిపింది. ఇక సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది. తుఫానులు సర్వసాధారణం అవుతాయని, వాటి తీవ్రత కూడా భారీగా ఉంటుందని పేర్కొన్నది. ఫలితంగా సాగునీటి లభ్యత 20 శాతం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
తగ్గనున్న పంటల దిగుబడి
వాతావరణంలో కలిగే మార్పులు పంట ఉత్పత్తుల దిగుబడిపై భారీ ప్రభావం చూపనున్నాయని ఐకార్ వెల్లడించింది. పంటల నాణ్యతపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నది. దాదాపు అన్ని రకాల పంటలపై.. మరీ ముఖ్యంగా వరి, గోధుమ, ఆలుగడ్డపై అధికంగా ఉంటుందని వెల్లడించింది. దీని ప్రకారం 2040 వరకు వరి దిగుబడిలో 12 శాతం, గోధుమ దిగుబడిలో 9 శాతం తగ్గుదల నమోదు కానుందని వెల్లడించింది. అలాగే, మక్కజొన్న దిగుబడిలో 18 శాతం, ఆవాల దిగుబడి 12 శాతం, ఆలుగడ్డ దిగుబడి 13 శాతం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వ్యవసాయ ఆదాయంలో 30 శాతం కోత
వాతావరణ మార్పులతో సాగు, పంటల దిగుబడి తగ్గడంతో దీని ప్రభావం వ్యవసాయ ఆదాయంపై పడుతుందని ఐకార్ వెల్లడించింది. ఈ కారణాలతో 2040 వరకు వ్యవసాయం ద్వారా సమకూరే ఆదాయం 30 శాతం తగ్గనుందని అంచనా వేసింది. ఇప్పటికే రైతులకు అంతంత మాత్రంగా ఆదాయం సమకూరుతున్నది. ఇప్పుడు ఇందులోనూ కోత పడితే ఇక రైతు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు మద్దతు ధర పెంచేందుకు, మద్దతు ధర చట్టం చేసేందుకు ససేమిరా అంటున్నది. ఈ నేపథ్యంలో ఓవైపు వాతావరణ ప్రభావం, మరోవైపు రైతులపై కేంద్రం కక్ష సాధింపుతో రైతుల కష్టాలు రెట్టింపు కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముందే మేల్కొంటే మంచిది
వాతావరణ మార్పులు వ్యవసాయంపై పెను ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐకార్ సూచించింది. లేకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఇందులో భాగంగానే ఐకార్ పలు సూచనలు చేసింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. రాష్ర్టాలవారీగా వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలని సూచించింది.
ఇదీ ప్రమాదం…