హైదరాబాద్ సిటీబ్యూరో/నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ఓట్లను బుధవారం లెక్కించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో, వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండ పట్టణం ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తుది ఫలితం తేలటానికి సుదీర్ఘ సమయం పడుతుందని భావిస్తున్నారు. అయితే.. గురువారం ఉదయానికి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బందికి షిప్టులవారీగా విధులు కేటాయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే అభ్యర్థి గెలుపునకు అవసరమైన ఓట్ల సంఖ్యపై స్పష్టత వస్తుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 3,57,354 ఓట్లు, వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానంలో 3,86, 320 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపునకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నది. గురువారం ఉదయం తర్వాతే విజయానికి ఏ అభ్యర్థి చేరువలో ఉన్నారనేది తెలుస్తుందని అధికారులు అంటున్నారు.
సాధారణ ఎన్నికల కౌంటింగ్లో రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత అంకెల లెక్కింపు ప్రాతిపదికన రౌండ్లు ఉంటాయి. ఒకటో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయితే మొదటి రౌండ్ పూర్తయినట్టు పరిగణిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు ఎన్ని అనేది తేలుతుంది. తొలిరౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికెన్ని వచ్చాయనేది తేలుస్తారు. చెల్లని ఓట్లను లెక్కపెడతారు. చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకఓటు కలిపితే ఎంత వస్తుందో దానిని కోటా (అభ్యర్థి గెలుపునకు కావాల్సిన ఓట్లు)గా నిర్థారిస్తారు. ఉదాహరణకు.. మూడు లక్షల ఓట్లు పోలైతే 2.50 లక్షల చెల్లిన ఓట్లు, 50 వేల చెల్లని ఓట్లు వచ్చాయి. చెల్లిన 2.50 లక్షల ఓట్లలో సగం అంటే 1.25 లక్షలకు ఒక ఓటు కలుపుకొని 1,25,001 ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఎవరైనా అభ్యర్థికి 1,25,001 ఓట్లు వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించి కౌంటింగ్ను ముగిస్తారు.
ఓట్ల లెక్కింపు చేపట్టే రెండుచోట్ల రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లను మంగళవారం సమీక్షించారు. నల్లగొండలో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రశాంత్జీవన్ పాటిల్.. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉదయం కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపుపై రిహార్సల్ నిర్వహించారు. సాయంత్రం ఏఆర్వోలకు కౌంటింగ్పై అవగాహన కల్పించారు. ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో కూడా రిటర్నింగ్ అధికారి ప్రియాంక.. అధికారులు, సిబ్బందితో సమావేశమై మార్గదర్శనం చేశారు.