హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కులవృత్తుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టును పూర్తిగా రజకులకే కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రజకులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురుకులాలు, దవాఖానలు వంటి ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులను ప్రస్తుతం టెండర్ ద్వారా కేటాయిస్తున్నారు. దీనివల్ల ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండే రజకులు ఆ కాంట్రాక్టులను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సంస్థల్లో దుస్తులు ఉతికే కాంట్రాక్టును రజక సొసైటీలకు అప్పగించాలని కుల సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరాయి. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కాంట్రాక్టును ఇకపై రజక సొసైటీలకు మాత్రమే అప్పగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని వాషర్మాన్ కో ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఎండీని ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై రజక సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది.
గొప్ప నిర్ణయం
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రూ. 30 కోట్ల ఖర్చుతో 644 దోభీఘాట్లను నిర్మించింది. ప్రతి మున్సిపాలిటీ బెంగుళూరు తరహాలో మాడ్రన్ లాండ్రీలను నిర్మిస్తున్నది. తెలంగాణ రజక ఫెడరేషన్ ద్వారా అధునాతన డ్రైక్లీనింగ్ యంత్రాల నిర్వహణపై రజక వృత్తిదారులకు శిక్షణ ఇప్పిస్తున్నది. ఇప్పుడు బట్టలు ఉతికే కాంట్రాక్టు పనులను కూడా రజకులకే కేటాయించడం గొప్పనిర్ణయం. రజక సామాజిక వర్గం తరపున సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు నా కృతజ్ఞతలు.
-శ్రీనివాస్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి
వారసులు ముందుకొస్తున్నారు
కేసీఆర్ నాయకత్వంలో రజకులకు భరోసా లభించింది. దోభీఘాట్లకు అందిస్తున్న 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ద్వారా ఇప్పటికే లక్షలమంది రజకవృత్తిదారులు లబ్ధి పొందతున్నారు. తాజాగా ప్రభుత్వ సంస్థల్లో లాండ్రీ కాంట్రాక్టు రజకులకు మాత్రమే కేటాయించడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో మా వారసులు కూడా కులవృత్తిని స్వీకరించేందుకు ముందుకొస్తున్నారు. కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ సంఘాల కన్వీనర్