హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎస్ సోమేష్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ క్యాటగిరీల్లో 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలో ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయం (బీఆర్కే భవన్)లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల డైరెక్ట్ రిక్రూట్మెంట్పై టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్ధన్రెడ్డితో కలిసి పలుశాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు.
టీఎస్పీఎస్సీ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. భర్తీ ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు రిక్రూట్మెంట్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్రూల్స్లో చేపట్టాల్సిన మార్పులు పూర్తిచేసి, అవసరమైన అన్ని వివరాలను టీఎస్పీఎస్సీకి వెంటనే అందజేస్తే.. వాటి ఆధారంగా వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీచేస్తుందని తెలిపారు. ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఎస్సీ కులాల సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.