హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 158.645 కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 24న ఎట్టకేలకు ఎనిమిది క్యాపిటల్ (ఏ) గెజిట్లతోపాటు ఇంటర్ చేంజ్ల నిర్మాణానికి అదనంగా మరో మూడు గెజిట్లు విడుదల చేసింది. దీంతో భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8 యూనిట్లను ఏర్పాటు చేసింది. వీటిలో ఏడు యూనిట్లకు ఆర్డీవోలను, మరో యూనిట్కు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ను భూసేకరణ అధికారులుగా నియమించింది. ప్రస్తుతం వీరంతా సంబంధిత భూముల యజమానుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. మరోవైపు రోడ్డు కోసం స్వాధీనం చేసుకునే భూమికి హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ పూర్తికాగానే యజమానులకు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకొనేందుకు 3(డీ) గెజిట్ను విడుదల చేస్తారు.
భూసేకరణ కోసం..
ట్రిపుల్ఆర్ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడానికి నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చులో సగం భరిస్తామని కేంద్రానికి తెలపడంతోపాటు ముందస్తుగా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి భూమిని సేకరించేందుకు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఏఐ చెరో సగం భరించాల్సి ఉంటుంది.
గజ్వేల్ కేంద్రంగా..
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించే ఈ రహదారికి 166(ఏఏ)గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నామకరణం చేసింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉండే ఈ రహదారి నిర్మాణంపై ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్రావు దృష్టి సారించారు. ప్రత్యేక ప్రాజెక్టు అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనులు గజ్వేల్ కేంద్రంగా జరుగనున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.