జయశంకర్ భూపాలపల్లి : పోలీసుల విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న వారు సైబర్ నేరగాళ్ల(Cyber criminals) వలలో సులువుగా చిక్కుతున్నారు. తాజాగా ఈ సారి ప్రభుత్వ ఉపాధ్యాయుడు(Government Teacher) సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ. 2.25లక్షలు పోగొట్టుకున్నాడు.
జయశంకర్ భూపాలపల్లి(Jayashanker district) జిల్లాలోన ఒక మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బుధవారం రాత్రి అజ్ఞాత వ్యక్తి నుంచి సెల్ఫోన్కు ‘ మీ బ్యాంకు ఖాతా నంబర్ బ్లాక్ చేయబడిందని మెసేజ్(Message) వచ్చింది. దీంతో కంగారు పడి మెసేజ్ పంపిన నంబర్కు ఫోన్ చేయగా, మొదట సీఐఎఫ్ నంబర్ చెబితే సరిపోతుందని నమ్మించాడు. అనంతరం ఆధార్(Aadhar), ఏటీఎం(ATM card) కార్డు నంబర్లు కూడా అడగడంతో సదరు ఉపాధ్యాయుడు అవి కూడా చెప్పాడు.
మరికొద్దిసేపటికి ఫోన్ చేసి మీ బ్యాంకు అకౌంట్కు ఆధార్కార్డు నంబర్ను లింక్ అప్డేట్ చేశానని, మధ్యమధ్యలో ఓటీపీ(OTP)లు వస్తాయని, చెప్పాలని కోరాడు. అవి చెప్పిన వెంటనే కొద్ది సేపటికే ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి మొదట రూ. లక్ష డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే సైబర్ నేరగాడికి ఫోన్చేయగా ‘ మీ డబ్బులు తిరిగి రాత్రి 10 గంటలకు మీ బ్యాంకు అకౌంట్లో జమ అవుతాయని’ నమ్మించాడు. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా రూ.25వేలు, మరోసారి రూ.50వేలు, ఇంకోసారి రూ.50 వేలు డ్రా అయినట్లు ఉపాధ్యాయుడి సెల్ఫోన్ నంబర్కు మెసేజ్లు వచ్చాయి. మొత్తం రూ.2.25 లక్షలు సైబర్ నేరగాడు కాజేశాడు.
తాను మోసపోయినట్లు గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని కుమారుడికి తెలుపగా వెంటనే రాత్రే సైబర్ క్రైం విభాగ సైట్కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం సైబర్ క్రైం(Cyber Crime ) టోల్ఫ్రీ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు ఇటీవల బీటెక్ పూర్తి చేయగా అతడిని విదేశాలకు పంపేందుకు అవసరమైన బ్యాంకు బ్యాలెన్స్ కోసం డబ్బులను అకౌంట్లో ఉంచుకున్నాడు. సైబర్ నేరగాడు తెలుగులోనే మాట్లాడాడని, డబ్బులు డ్రా అయిన తర్వాత మోసపోయానని గుర్తించానని బాధితుడు వాపోయాడు.