హైదరాబాద్ : కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. బ్రిడ్జికోర్సులో భాగంగా పై తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటుంది.
బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్ పాఠ్యాంశాలతో పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహిస్తారు. ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు. నాలుగు లెవల్స్గా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్ చొప్పున విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలు బోధిస్తారు.
తరగతుల వారిగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. టీశాట్ విద్యచానల్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జులై 1 నుంచి టీచర్లు ఆయా పాఠ్యాంశాలను తరగతి గదిలోనే బోధిస్తారని అధికారులు వెల్లడించారు.