ఈ భవనాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీలను చూసినట్టు తోస్తున్నదా? సరిగ్గా చూడండి ఇది మన స్కూలే.. తెలంగాణలో విద్య పరిణామ క్రమానికి ఈ చిత్రం ససాక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా రహేజా ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కేజీ టు పీజీ విద్యా నిలయం ఇది.
విద్య అంటే తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీలు పట్టేది మాత్రమే కాదన్న పండితుల వాక్కులకు వాస్తవ రూపం ఈ చిత్రం.. ఒలింపిక్ క్రీడల్లో కనిపించే రన్నింగ్ ట్రాక్, ప్లే కోర్టుల్లాగా ఇక్కడ కనిపిస్తున్న సౌకర్యాలు విద్యార్థుల శారీరక, మానసిక వికాస ప్రాధాన్య చిహ్నాలు. ఇక్కడ లేని సౌకర్యమంటూ లేదు. అంగన్వాడీ కేంద్రం, అత్యాధునిక డైనింగ్ హాల్, కంప్యూటర్ల్యాబ్.. ఒకటేమిటి విద్యార్థులు సంపూర్ణ మూర్తిమత్వం సాధించే ఆధునిక దేవాలయంగా ఈ విద్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఇంతటి అత్యాధునిక భవనాన్ని కేవలం నాలుగు నెలల్లోనే ప్రారంభానికి సిద్ధం చేయటం విశేషం.