వరంగల్, ఆగస్టు 20: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన వరంగల్ నగరానికి తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయన కుడా కార్యాలయ ఆవరణలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా దాస్యం మీడియాతో మాట్లాడుతూ.. 2020లో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అప్పట్లోనే క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి కేటీఆర్ అప్పటికప్పుడే రూ. 20 కోట్లు తక్షణ సాయం మంజూరు చేసి తర్వాత రూ.100 కోట్లు మంజూరు చేసి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల వరద ముంపునకు గురైన నేపథ్యంలో తక్షణ సాయంగా రూ.250 కోట్లు మంజూరు చేసి నగరానికి అండగా నిలిచారని కొనియాడారు.