ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఫ్యామిలీ పెన్షన్ నిబంధనల్లో సవరణ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో 58లో సవరణలు చేపట్టారు. ఉద్యోగానికి అశక్తుడైన లేదా మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలంటే ఉద్యోగి ప్రాన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగించాలనే షరతు ఉండేది. కానీ, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఏవిధంగా సరెండర్ చేయాలో మాత్రం జీవోలో పేర్కొనలేదు. అందువల్ల మరణించిన ఉద్యోగుల వారసులు కుటుంబ పెన్షన్ పొందలేకపోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి తగు వినతులు వచ్చాయి. సమస్యలోని మూలాన్ని అర్థం చేసుకొన్న సీఎం కేసీఆర్ ఫ్యామిలీ పెన్షన్ జీవోలో సవరణ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
‘ఫ్యామిలీ పెన్షన్’ హర్షణీయం : టీఎస్ సీపీఎస్ఈయూ
ఉపాధ్యక్షుడు పవన్ కుమార్
రాష్ట్రంలో ‘ఫ్యామిలీ పెన్షన్’కు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఎస్ సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ ఎంతోమంది ఉద్యోగుల కుటుంబాలకు ఓ వరమని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగి అశక్తుడైనా లేదా మరణించినా సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ అందిస్తామని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ప్రస్తుతం దానిని నెరవేర్చారని కొనియాడారు. ఇచ్చిన మాటను కేసీఆర్ ఎన్నడూ తప్పరని ఇప్పుడు మరోసారి రుజువైందని తెలిపారు. ఈ పెన్షన్తో1.5 లక్షల సీపీఎస్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నదని పేర్కొన్నారు.