హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు లెక్చరర్లు నడుంబిగించారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం (టీజీసీటీఏ) రూపొందించిన పోస్టర్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఆవిష్కరించారు.
లింబాద్రి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సకల సౌకర్యాలతో విరాజిల్లుతున్నాయన్నారు. నిపుణులైన అధ్యాపకులు, విశాలమైన క్రీడామైదానాలు, మెరుగైన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, టాస్క్, ప్లేస్మెంట్స్ వంటి సదుపాయాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్రావు, సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఈ బ్రిజేశ్, కార్యదర్శులు సంగి రమేశ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.