హుజూరాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సైదాపూర్ రోడ్డులోని సిద్దార్థనగర్లో ప్రతిపాదిత శ్రీ లక్ష్మి గణపతి దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని స్థానికులతో పాటు బోర్నపల్లి వాసులు మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకొచ్చారు. గురువారం బోర్నపల్లికి మహిళా భవనం భూమిపూజ కోసం వచ్చిన హరీశ్రావు స్థానికులు విజ్ఞప్తి చేశారు. స్థానికుల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి హరీష్ రావు కాలనీలో ప్రతిపాదిత దేవాలయ స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పరిశీలించారు. భక్తులు కోరిందే తడవుగా హుజురాబాద్ ఆర్డీవోకు ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.
తమ విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన మంత్రి హరీష్ రావుకు ఆలయ అర్చకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు దొంత రమేష్, వేదం పండితులు పందిళ్ళ విజేందర్ శర్మ, భాస్కర్ శర్మ, కాలనీ వాసులు, బోర్నపల్లి వాసులు అంగారక ప్రసాద్, సాగి వీరభద్రరావు, గొల్లపల్లి రవీందర్, విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, మనోజ్, రమేష్, శివ ప్రసాద్, తిరుపతి రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేయనున్నట్లు వారు వెల్లడించారు. మంత్రి హరీష్ రావు వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, గందె రాధిక శ్రీనివాస్, కొలిపాక నిర్మల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.