DDN Scheme | ధూప దీప నైవేద్య పథకాన్ని (DDN) మరో 350 ఆలయాలకు వర్తింపజేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271 పెరిగింది. అలాగే ఈ నెల నుంచి డీడీఎన్ ఆలయాలకు ప్రతి నెలా రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 11వేలకుపైగా ఆలయాలను ఈ పథకంలో చేర్చాలనే ప్రతిపాదన ఉండగా.. దశలవారీగా పథకాన్ని వర్తింపజేస్తున్నది. ఇందులో భాగంగా 350 ఆలయాలను కొత్తగా చేర్చింది.
అంతేకాకుండా 3,500 ఆలయాల్లోని అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు సైతం ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో 9,771 ఆలయాలకు ప్రభుత్వ సహకారం ద్వారా ధూప దీప నైవేద్య కార్యక్రమాలు అమలవుతున్నది. మిగతా మరో 250 ఆలయాలకు సైతం పథకాన్ని వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే మొత్తం సంఖ్య 11వేలు దాటనున్నది. మరో వైపు ఆయా ఆలయాల్లోని అర్చకులకు ఈ నెల రూ.10వేల వేతనం ఇవ్వనున్నారు. హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అర్చకుల గౌరవేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.