Salaries Hike | పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజైన సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. జీహెచ్ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు.
‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో కష్టించి పనిచేసే ప్రతీ ఒక్క కార్మికుని సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.
తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదని సీఎం తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని సీఎం అన్నారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని అన్నారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం పట్ల ఈ సందర్భంగా సీఎం హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.