Godavari | హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను మెరుగుపరిచేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం జీవో జారీ చేసింది. రెండో దశ పనులకు ప్రభుత్వం రూ.5,560 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టులో నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలను సైతం నింపనున్నది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో పనులు పూర్తి చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా అవుతున్నది.
2030 నాటికి నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని 170 ఎంజీడీల అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందు కోసం గోదావరి నుంచే 30 టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు ఉన్నది. 2030 నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందని అంచనా. 2050 నాటికి 1014 ఎంజీడీలుగా ఉండబోతున్నది. ఫేజ్-1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తున్నది. తాజాగా పథకం రెండో దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది.
ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా.. మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ఇందులో పంప్హౌస్లు, సబ్స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3600 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. అంతే కాకుండా ఘన్పూర్, శామీర్పేట వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు.. ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.