హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై ఇస్తున్న 25% రాయితీ గడువును మరోసారి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3వ తేదీతో ముగిసిన గడువును జూన్ వరకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ఎల్ఆర్ఎస్పై రాయితీ గడువును ఇప్పటికే ఒకసారి ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడం తదితర కారణాలు పథకం అమలుకు అడ్డంకిగా మారిన నేపథ్యంలో రాయితీ గడువును మళ్లీ మళ్లీ పొడిగిస్తున్నట్టు తెలిసింది. 2020లో ప్రారంభమైన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద 25.67 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారిలో 40% మందికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
అయితే 5.19 లక్షల మంది మాత్రమే ఏప్రిల్ 30 నాటికి చెల్లింపులు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా రూ.20,000 కోట్ల ఆదాయాన్ని ఆశించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రూ.1,863 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో మరింత మంది దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు గడువును జూన్ వరకు పొడిగించే యోచనలో ఉన్నది.