భారీగా పరమపద వాహనాల కొనుగోలు
పట్టణాల్లో రూ.200 కోట్లతో పనులు
హైదరాబాద్, మార్చి 6 : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. హైదరాబాద్లోని మహాప్రస్థానం తరహాలో అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని ఆదేశించిన సీఎం కేసీఆర్.. ఇందుకోసం ఇప్పటికే రూ.200 కోట్లు కేటాయించారు. దీంతో వివిధ ప్రాంతాల్లో 183 వైకుంఠధామాల నిర్మాణానికి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 136 పట్టణాల్లో 172 వైకుంఠధామాల నిర్మాణానికి పరిపాలన, సాంకేతికపరమైన అనుమతులను ఇచ్చారు. వీటిలో 161 వైకుంఠధామాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వరంగల్, భైంసా, మందమర్రి, సిరిసిల్ల, గజ్వేల్ పట్టణాల్లో ఇప్పటికే ఆధునిక వైకుంఠధామాలు నిర్మించారు. కొన్ని పట్టణాల్లో నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. వీటిలో మొక్కల పెంపకం, పార్కింగ్ వసతి, విద్యుత్తు దీపాలు, నీటివసతి, ఇంకుడు గుంతలు, ప్లాట్ఫామ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, స్నానపుగదులు, అస్తికలను భద్రపరిచే గదులు, ప్రహరీగోడ నిర్మాణాలు జరగాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటికే 1,333 శ్మశానవాటికలు ఉన్నాయి. గతేడాది 265 శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేశారు. మరో 1,068 శ్మశానవాటికలను అభివృద్ధి చేయాల్సి ఉన్నది. జగిత్యాల, మంచిర్యాల, నస్పూర్, కోరుట్ల, మెట్పల్లి, కొత్తగూడెం, పాల్వంచ, మహబూబాబాద్, కామారెడ్డి, బోధన్, మీర్పేట్, జల్పల్లి, వికారాబాద్, షాద్నగర్, సూర్యాపేట, కొదాడ, భువనగిరి పట్టణాల్లో రెండు చొప్పున వైకుంఠధామాలును నిర్మిస్తున్నారు.
పరమపద వాహనాలు
పట్టణల్లో వైకుంఠధామాల నిర్మాణంతోపాటు పరమపద వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. 43 పట్టణాల్లో 54 పరమపద వాహనాలు ఉన్నాయి. పట్టణప్రగతి మూడోవిడతలో భాగంగా 22 పట్టణాల్లో 25 వాహనాలను కొన్నారు. మరో 26 వాహనాలు కొనుగోలు దశలో ఉన్నాయి. మరో 34 పట్టణాల్లో పరమపద వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉన్నది.