హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు నూతన గవర్నర్ ప్రసంగం ( Governor speech) లో అబద్దాలు పలికించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం మొత్తం డొల్ల అని, చిత్తు కాగితంతో సమానమని పేర్కొన్నారు.
కొత్తగా వచ్చిన గవర్నర్ తో ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీంల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదని,ఉన్నదల్లా కాంగ్రెస్ స్కాముల ( Congress Schams ) గురించే ఉందని అన్నారు. గవర్నర్ ప్రసంగంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, 6 గ్యారంటీలు, 420 హామీల పై గవర్నర్ ప్రసంగంలో లేదని పేర్కొన్నారు.మహిళలకు ఇస్తామని చెప్పిన రూ. 2,500 గురించి ప్రస్తావనే తేలేదని ,రెండేళ్ల నుంచి మహిళలను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
రైతులు , నిరుద్యోగులు వృద్ధులు , వితంతువులు , వికలాంగుల గురించి ప్రస్తావనే తేలేదని పేర్కొన్నా.కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా సక్కగా రావడం లేదని రైతులు నిలదీస్తు న్నారని వివరించారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు
12 వేల ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ తో అబద్ధం చెప్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.