నాగర్ కర్నూల్ : గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాల ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా గిరిజనులతో సమావేశమై, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదివాసిలకు సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రం, టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఆశ్రమ పాఠశాలలను గవర్నర్ తమళిసై ప్రారంభించారు.
అనంతరం గరవ్నర్ మాట్లాడుతూ.. ఓ వైద్యురాలిగా మీ జీవన స్థితిగతులపై ఆందోళనగా ఉంటుందన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. న్యూట్రిషన్ పథకం చాలా ప్రత్యేకమైందని, టూ వీలర్ అంబులెన్స్, రాజశ్రీ కోళ్లు, మందులు అందించడం ఆనందం కలిగిస్తుందన్నారు. భౌరాపూర్ పథకం ఇతర పెంటలకు విస్తృతం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పని చేయాలని సూచించారు. తన ప్రయత్నంలో సహకరించిన రెడ్ క్రాస్, కలెక్టర్, తదితర శాఖలకు అభినందనలు తెలిపారు. సర్పంచులకు ద్విచక్ర అంబులెన్స్లను అందజేసిన గవర్నర్ పర్యటన అనంతరం శ్రీశైలం వెళ్లనున్నారు.