చెన్నై: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు తృటిలో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మామల్లాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను పైకిలేపారు. అయితే గవర్నర్కు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గవర్నర్ తమిళిసై ఆదివారం తమిళనాడులో పర్యటించారు. మామల్లాపురం సమీపంలోని పత్తిపురం గ్రామంలో జరిగిన మొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో తన కారు దిగి వెళ్తుండగా నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా కాలు స్లిప్ అవడంతో కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపి నిలుచోబెట్టారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలవలేదు.
అయితే తాను కిందపడిపోయినందున ఈ వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్, బిగ్ న్యూస్ అవుతుందని చమత్కరించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరుగుతుందో లేదోకానీ తాను కిందపడిపోవడం మాత్రం పెద్ద వార్తవుతుందంటూ సరదాగా పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసై అక్కడి నుంచి వెళ్లిపోయారు.