కవాడిగూడ, మే 8: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి శనివారం ముషీరాబాద్ నియోజకవర్గాన్ని సందర్శించారు. కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్లలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కరోనా వ్యాక్సిన్, కరోనా నిర్ధారణ పరీక్షల గురించి స్థానిక దవాఖానల వైద్య స్బిబందిని అడిగి తెలుసుకున్నారు. కవాడిగూడలోని డీబీఆర్ మిల్స్ యూపీహెచ్సీ, భోలక్పూర్లోని బైబిల్ హౌజ్ యూపీహెచ్సీలను ఆమె ఆకస్మికంగా సందర్శించి దవాఖానాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు.
కరోనా టీకాలను రోజుకు ఎంతమందికి ఇస్తున్నారని.. వైద్య పరీక్షలు ఎంతమందికి చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మందుల పంపిణీపై కలెక్టర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. డీబీఆర్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్, దవాఖానల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.