హైదరాబాద్: సంక్షేమం-అభివృద్ధి జోడుగుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ఒక చారిత్రక అద్భుతమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. నూతన సచివాలయానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంబేద్కర్ ఔన్నత్యాన్ని ప్రతిఫలించేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల విగ్రహ నిర్మాణం జరుగుతున్నదని వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్ విభజించుకున్నామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా 9.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రపంచ స్థాయి పోలీసింగ్ వ్యవస్థకు తార్కాణమన్నారు.
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానమైందని వెల్లడించారు. ఐటీ రంగంలో మేటిగా తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని చెప్పారు. పర్యవరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలలో ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుంటున్నామన్నారు. ఆదర్శవంతమైన పరిస్థితికి చేర్చే క్రమంలో ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నదని చెప్పారు. ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప వ్యవధిలో దేశం నివ్వెరపోయే అద్భుతాలను సాధించామన్నారు. అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగామన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రూపొందిందన్నారు. అన్నిరంగాల్లో అభివృద్ధి గతంకన్నా రెట్టింపు స్థాయిలో పెరిగిందని చెప్పారు.
మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి కొత్త ఆయకట్టును అభివృద్ధి చేశామన్నారు. యుద్ధ ప్రాతిపదికన భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులను నిర్మించామని చెప్పారు. మూడున్నరేండ్ల రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. 2014-15లో 20 లక్షల ఎకరాలకే సాగునీటి సౌకర్యం ఉండగా, నేడు అది 73 లక్షల 33 వేల ఎకరాలకు పెగిందన్నారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని చెప్పారు. పంటపెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం మనదేనని గర్వంగా ప్రకటిస్తున్నానని అన్నారు. రైతుబీమా రైతు కుటుంబానికి భరోసా ఇస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి రైతు బీమాయే నిదర్శనమన్నారు. రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. రాష్ట్ర జీడీపీలో 18.2 శాతం వ్యవసారంగం నుంచే వస్తున్నదని తెలిపారు.