హైదరాబాద్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా 146వ జయంతిని రాజ్ భవన్ సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి గవర్నర్ పుష్పాంజలి ఘటించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భగవాన్ బిర్సా ముండా జరిపిన పోరును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. స్వాతంత్ర్య పోరులో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, త్యాగాలు చేసిన ఎందరో గిరిజన స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ తమిళిసై స్పష్టం చేశారు. గిరిజన స్వాతంత్య సమరయోధుల సేవలను భావితరాలకు తెలిసేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో మ్యూజియాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించడం శుభపరిణామం అని అన్నారు. గొప్ప చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన గిరిజనుల విశిష్ట సంస్కృతి సంప్రదాయాలను కళలను కాపాడాల్సిన ఆవశ్యకతను గవర్నర్ వివరించారు.