ఖమ్మం, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. రాజ లాంఛనాలతో నిర్వహించిన ఈ వేడుకను భక్తజన కోటి తిలకించి పరవశించింది. 12 నదులు, నాలుగు సముద్రాలు, పుష్కరిణి నుంచి సేకరించిన జలాలతో పండితులు మహాకుంభ తీర్థ ప్రోక్షణ చేయడంతో భక్తులు తరించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యా ణం జరిగిన మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. శుక్రవారం నిర్వహించిన పట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై రామయ్యకు పట్టువస్ర్తాలు సమర్పించారు.
పట్టాభిషేకం కోసం శిల్పకళా శోభిత కల్యా ణ మండపమైన మిథిలా స్టేడియానికి సరిగ్గా ఉదయం 10 గంటలకు శ్రీరామచంద్రమూర్తిని తీసుకొచ్చారు. వేదికపై స్వర్ణ సింహాసనంపై ఉంచి పట్టాభిషేక ఘట్టాన్ని ప్రారంభించారు. భక్తజనం ఈ వేడుకను తిలకించి పులకించింది. దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ప్రధాన లాంఛనమైన సామ్రాట్ కిరీటాన్ని రామయ్యకు ధరింపచేయగా భక్తజనకోటి కరతాళధ్వనులతో జేజేలు పలికారు. వేదాశీర్వచనం, అష్టోత్తర శతహారతి 108 ఒత్తులతో వెలిగించి భద్రాచలం శ్రీరామచంద్రప్రభువుకు సమర్పించడంతో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం సంపూర్ణమైంది. ఈ వేడుకలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, దేవస్థానం ఈవో రమాదేవి, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.