TG Assembly | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. సమావేశాలకు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రజలే కేంద్రం పాలన సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని, జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని, అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందని జిష్ణుదేవ్ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రానికే రైతులే ఆత్మ అని.. వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వారే అన్నదాతలని.. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, రైతులకు మద్దతు ఇవ్వడం, వారిని శక్తివంతులుగా తీర్చేదిద్దే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. రైతులకు రుణమాఫీ చేశామని, రైతుల రైతుల పట్ల మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 25.35లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని.. ఎకరానికి రూ.12వేల చొప్పున రైతులకు అందిస్తున్నామని.. రైతునేస్తం అమలు చేస్తున్నట్లు చెప్పారు. వరి రైతులకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి గేమ్ ఛేంజర్ పథకమని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ పురోగమించడమే కాదు.. రూపాంతరం చెందుతోందన్నారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్తో పని చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలని, తెలంగాణ భౌగోళిక పాత్రమే కాదు.. ఒక భావోద్వేగమన్నారు. తెలంగాణ స్థిరత్వం, దృఢసంకల్పానికి గుర్తు అన్నారు.రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందన్నారు. 260లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇది మన రైతుల స్థిరత్వం, అంకిత భావానికి ఓ సాక్ష్యమన్నారు. రూ.2లక్షల పంట రుణమాఫీని అమలు చేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. రుణమాఫీతో రూ.20,616.89కోట్లతో 25.35లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందన్నారు. ఇది ప్రభుత్వం చేసిన వాగ్ధానాల నిర్దిష్ట కాల అమలుకు సాక్ష్యమన్నారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి ఎకరాకు రూ.12వేలకు పెంచినట్లు వివరించారు.