సూర్యాపేట, హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్ను, గవర్నర్ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వ్యవస్థల ప్రతిష్ఠలను దిగజార్చటమే బీజేపీ విధానంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఓ టీవీ చానల్తో మాట్లాడిన మంత్రి.. రాజ్యాంగ వ్యవస్థలు, వాటి విలువలు, ప్రతిష్ఠలు కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఇంకెవరైనా! అని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు కొంతకాలంగా రాజ్భవన్ను, గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తున్నదని, అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ వ్యవహరిస్తుందని తెలిపారు. గవర్నర్ మొదట్లో ఈ వైఖరితో లేరని, ఉన్నట్టుండి ఈ మధ్యకాలంలో ఆమె వ్యవహార సరళిలో మార్పులు వచ్చాయని విమర్శించారు. బీజేపీ ప్రభావానికి లోనై ఇలా వ్యవహరిస్తున్నారా? లేక ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారా? అన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎంపిక విషయంలో రాష్ట్రమంత్రివర్గ నిర్ణయానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించినా, సీఎం కేసీఆర్ సహనంతో వ్యవహరించారని తెలిపారు.
మంత్రివర్గ నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిన ఎమ్మెల్సీ పేరును గవర్నర్ వెనక్కి పంపితే, మంత్రివర్గం అదే పేరును మళ్లీ పంపిస్తే గవర్నర్ ఆమోదించక తప్పని పరిస్థితి ఉంటుందని, అయినా తాము ఆ పని చేయలేదని చెప్పారు. ముఖ్యమంత్రి గవర్నర్ వ్యవస్థకు విలువ ఇచ్చి ఓపికతో వ్యవహరించారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సంస్కారవంతంగా ఉండటమే కాకుండా, అవే విలువలు పాటించాలని తమకు చెప్తుంటారని గుర్తుచేశారు. ప్రొటోకాల్ విషయంలో ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన రాజ్భవన్ను రాజకీయ వేదికగా మార్చటం సరికాదని అన్నారు. రాజ్భవన్ సుహృద్భావ వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన హోదాలే రాజకీయాలకు తావిచ్చేలా అవకాశాలు కల్పిస్తే, అవతలి పక్షం అదే కోణంలో ఆలోచిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు.