హైదరాబాద్ : సవాళ్లను ఎదుర్కొంటూ.. కలలను సాకారం చేసుకునేందుకు విద్యార్థులు శ్రమించాలని.. అప్పుడే విజేతలుగా నిలుస్తారని గవర్నర్ తమిళిసై అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవం ఠాగూర్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. రెండేళ్ల విరామం అనంతరం స్నాతకోత్సవం జరుగుతుండడంతో 2018-2019, 2019-2020 విద్యా సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలను ఈ సందర్భంగా ప్రదానం చేశారు. కార్యక్రమానికి వర్సిటీ వైస్ చాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై, ముఖ్య అతిథిగా డీఆర్డీఓ చైర్మన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి జీ సతీశ్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీసీ విద్యార్థులతో వర్సిటీ సంప్రదాయం ప్రకారం ప్రతిజ్ఞ చేయించి, ఆ తర్వాత 35 మందికి బంగారు పతకాలను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఆరోగ్యం, సంతోషాల వషయంలో రాజీపడొద్దని సూచించారు. చిన్న, చిన్న సమస్యలకు కుంగిపోకూడదని, విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై కృషి చేయాలని సూచించారు. దేశం అన్ని రంగాల్లో పురోగమించేందుకు నూతన ఆవిష్కరణలు కీలకమన్నారు. శతవసంతాల వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడం గర్వించదగిన విషయమని, వారంతా తిరిగి వర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డీఆర్డీఓ చైర్మన్ సతీశ్రెడ్డి మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవడంపై ఆనందం వ్యక్తం చేశారు. దేశ విద్యారంగంలో ఓయూ సమున్నత స్థానాన్ని కలిగి ఉందన్నారు. ఎంతో మంది ఓయూలో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారని గుర్తు చేశారు. తనకు 1986 నుంచి ఓయూతో అనుబంధం ఉందని.. పరిశోధనల నిమిత్తం వర్సిటీలోని నావిగేషన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూనిట్ (ఎన్ఈఆర్టీయూ)కు క్రమం తప్పకుండా వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. దేశం ఇప్పటికే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
రక్షణ రంగంలో ఎన్నో విషయాల్లో అగ్రదేశాల సరసన నిలిచిందని పేర్కొన్నారు. ఆయా రంగాలలో మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దేశంలో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయన్నారు. యూనివర్సిటీలలో లోతైన పరిశోధనలు జరగాలని, అందుకు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందని అన్నారు. మన దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులు ఏ దేశంలోనైనా అమ్మగలిగేలా ఉండాలన్నారు. దీంతో విదేశీ మారకద్రవ్యం సైతం పెరుగుతుందని చెప్పారు. తక్కువ ధరలో నాణ్యమైన నూతన ఆవిష్కరణలు జరిగినప్పుడే అది సాధ్యపడుతుందని వివరించారు.
అనంతరం ఆయన తన చేతుల మీదుగా పీహెచ్డీ పూర్తి చేసిన 319 మందికి పట్టాలను ప్రదానం చేశారు. స్నాతకోత్సవం సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్ ఎం రమేశ్రెడ్డి, ఏసీపీ ఆకుల శ్రీనివాస్, సీఐ రమేశ్నాయక్లు స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఇఫ్లూ, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ, తెలంగాణ వర్సిటీల వీసీలు ప్రొఫెసర్ ఇ. సురేశ్కుమార్, కట్టా నర్సింహారెడ్డి, గోపాల్రెడ్డి, రవీందర్గుప్తా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, పీఆర్వో డాక్టర్ సుజాత, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.