జనగాం : తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలకు సమానత్వం, సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరులో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలికల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలిపారు. బాలికల రక్షణకు, భ్రూణ హత్యల నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆడపిల్లలపై దాడులు అమానుష ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. షి – టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖీ సెంటర్లు నెలకొల్పి అండగా నిలుస్తోంది అన్నారు. బాలికలు ప్రదర్శనలో మంత్రి కరాటే విన్యాసాలు చేయడం అందరిని ఆకట్టుకుంది. కరాటే ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.