కందుకూరు. నవంబర్ 19 : ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవాదులు, రాష్ట్ర బీజేపీ పార్టీ ఎస్టీ మోర్చ లీగల్ సెల్ కన్వీనర్ కిషన్ రాజ్ చౌహన్, ఆయన భార్య ప్రణిత సింగ్ చౌహన్ ఆ పార్టీకి రాజీనామ చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది వారికే స్పష్టత లేదన్నారు. ఆరు నెలలకు ఇక సీఎం మారుతాడని అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇంటింటి పంపించాలని కోరారు. ఎస్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని చెప్పారు.