హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి జరుగుతున్న కృషి ప్రశంసనీయమని తమిళనాడు విసికె శాసనసభ్యులు పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను వీసికె పార్టీ ఫ్లోర్ లీడర్ ఎస్.సెల్వన్, ఎస్.ఎస్.బాలాజీతో పాటు పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం సందర్శించింది.
తెలంగాణలో దళితుల కోసం అమలువుతున్న పథకాలపై తాము అధ్యయనం చేస్తునట్లు వారు వెల్లడించారు. పాలకుల నిర్లక్ష్యంతో నేటికి అణగారిన వర్గాలుగా ఉంటున్న దళితుల జీవనస్థితి,గతులలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు వంటి పథకాలతో ప్రపంచ దేశాలను ఆకర్శిస్తుందన్నారు.
విద్యతోనే అభ్యున్నతి అని చెప్పిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆరంతస్థుల భవనంలో 27 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం నభూతో అన్న విధంగా చేపట్టిందని వెల్లడించారు. దళిత్ స్టడీ సెంటర్ తెలంగాణలో దళితుల అభ్యున్నతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. తమిళనాడులో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టేందుకు శాసనసభ వేదికగా తమవంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
వారి వెంట సీడీఎస్ చైర్పర్సన్ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తితో పాటు చెన్నై కార్నర్ స్టోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రిచర్డ్ దేవదాస్, త్రివేండ్రం ఎస్ఏఎస్వై స్టేట్ కో ఆర్డినేటర్ మురుగప్పన్, ఈడీ డాక్టర్ విఏ రమేశ్నాథన్, తమిళనాడు సోషల్ వాచ్ ఈడీ కుమార్, ప్రతినిధుల బృందం సభ్యులు పాల్గొన్నారు.