హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): గల్ఫ్ కార్మికులు, ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణవా సులకు ఎన్నారై అడ్వైజరీ కమిటీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం పక్షాన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, వారి పిల్లల విద్య కోసం ప్రత్యేక సీట్లు కేటాయించినట్టు ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఓవర్సీస్ మొబిలిటీ బిల్ – 2025పై అన్ని రాష్ట్రాల సూచనలు అడుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ గురువారం మంజీరా ఐఏఎస్ గెస్ట్ హౌస్లో సమావేశమైంది. చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్రెడ్డితోపాటు పలువురు ఎన్నారై కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గల్ఫ్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 2023 డిసెంబర్ 7 నుంచి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు గుర్తుచేశారు.