మంచిర్యాల : గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో ఆందోళనలు చేసిన ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం బస్ డిపో మంజూరు చేశారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే చెన్నూరు బస్ డిపో పనులకు ఆదివారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు ఇదొక సుదినం అన్నారు.
ఈ ప్రాంత ప్రజల దశాబ్దలకల చెన్నూరు బస్ డిపో నేడు సాకారం అవుతున్నది. నేషనల్ హైవే కి అనుకొని నాలుగు ఎకరాల్లో నాలుగు కోట్ల రూపాయలతో బస్ డిపో నిర్మాణం రెండు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రెండు నెలల్లో బస్ డిపో నిర్మాణం పూర్తి చేసుకొని చెన్నూరు కేంద్రంగా మంచిర్యాల, జైపూర్, భీమారం, కోటపల్లి మండలాలతో పాటు నెన్నెల, భీమిని, కన్నెపల్లి, మంథని, కాటారం, మహదేవపూర్, గోదావరిఖని, పెద్దపెల్లి, అదిలాబాద్, బాసర వరకు రవాణా సౌకర్యం ఉండేలా బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకులని తిరిగి గెలిపించాలి. విపక్షాల దుష్ప్రచారాలు, మోసపూరిత వాగ్దానాలు నమ్మకూడదని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బస్ డిపో ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్, ఎండి సజ్జనార్కు ధన్యవాదాలు తెలిపారు.