హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): హజ్యాత్రికులకు తెలంగాణ సర్కారు అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని, యాత్రలో ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏటా ఏర్పాట్లు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం నాంపల్లిలోని హజ్హౌస్లో వ్యాక్సినేషన్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హజ్యాత్రకు వెళ్లే వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో పాటు రాష్ట్రం, సీఎం కేసీఆర్ కోసం ప్రార్థనలు చేయాలని సూచించారు. హజ్యాత్ర నిర్వహణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. యాత్రికులకు అవసరమయ్యే అన్నిరకాల వ్యాక్సినేషన్ల అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేసే ఏకైక ప్రభుత్వం కేసీఆర్దేనని, మైనార్టీల సంక్షేమంలో దేశంలో ముందుందని కొనియాడారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీమ్, మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.