హైదరాబాద్ : ఈ నెల 28న జరుగనున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మక్స్) ఎన్నికలు రాజకీయాలకు అతితంగా జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంతో సహకరించే వారినే ఎన్నుకోవాలని సూచించారు. తద్వారా సమస్యల పరిష్కారం సులబతరమవుతుందని, తద్వారా డెయిరీ అభివృద్ధికి తోడ్పాటు అందించిన వారమవుతామని నార్మక్స్ సొసైటీలకు మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
ఆరు డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మంత్రి జగదీశ్రెడ్డి హయత్నగర్ వద్ద ఉన్న నార్మక్స్ కేంద్రానికి చేరుకుని నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరగబోయే ఈ సొసైటీ ఎన్నికల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సహకరించే వారిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, నార్మక్స్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.