కమాన్చౌరస్తా, 25: నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని, కొలువుల కల సాకారానికి లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలనే సకల్పంతో నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని పునరుద్ఘాటించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులో ఉన్న కృషిభవన్ ప్రతిమ ఫౌండేషన్ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిళ్లను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నోటిఫికేషన్ల నేపథ్యంలో ఈ ఏడాది 150 మందికి కోచింగ్ ఇస్తున్నట్టు వివరించారు. కృషిభవన్లో మరికొంత స్థలం కేటాయిస్తే మరింత మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. నైపుణ్యం ఉన్న టీచర్లను కేటాయించి శిక్షణ అందించడంతో పాటు కావల్సిన స్టడీ మెటీరియల్ను కూడా అందిస్తామని చెప్పారు.
యువతి యువకులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉచిత శిక్షణ కేంద్రాలతో పాటు ప్రతిమ ఫౌండేషన్ స్టడీ సర్కిల్ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగ అవకాశాల్లో పైరవీలకు తావులేకుండా ఉండాలనే ఆలోచనతో ఇంటర్వ్యూను తొలగించారని గుర్తుచేశారు. శిక్షణాకేంద్రంలోని అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్, మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఉచిత మధ్యాహ్న భోజనం, ఎండాకాలం ముగిసే దాకా కరీంనగర్ డెయిరీ సహకారంలో మజ్జిగ లేదా లస్సీ అందిస్తామని చెప్పారు.
అనంతరం స్టడీ సర్కిల్లోని అభ్యర్థులతో మాట్లాడారు. బోధన విధానం, కావాల్సిన ఇతర వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం పుస్తకాలు కావాలని ఆయన్ను కోరగా, హైదరాబాద్లో ఎంపిక చేసిన పుస్తకాలను ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు, నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, నాగరాజు, మల్లికార్జున్, సంపత్ తదితరులు ఉన్నారు.