హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో గురుకులాలు సత్తాచాటాయి. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలను మించి అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఫస్టియర్లో 73.30 శాతం, సెకండియర్లో 78.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీటితో పొల్చితే ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు తక్కువ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి.
నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.16 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది కూడా ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఫస్టియర్లో 72.33 శాతం, సెకండియర్లో 75.28 శాతం మంది పాసయ్యారు. బాలురు ఫస్టియర్లో 54.25 శాతం, సెకండియర్లో 59.21 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి మొదటిస్థానంలో, హనుమకొండ రెండో స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెండోస్థానం దక్కించుకున్నది. ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూలై 11 నుంచి మొదలవనున్నాయి. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమల్ జలీల్ పాల్గొన్నారు.
ఆశాజనకంగా ఫలితాలు..
సుదీర్ఘ విరామం తర్వాత ఇంటర్ పరీక్షలను పూర్తిస్థాయిలో నిర్వహించినా.. ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. కరోనా కారణంగా తరగతులు జరుగకపోవడంతో విద్యాప్రమాణాలు పడిపోయాయి. 2021 అక్టోబర్లో ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 49 శాతం మంది మాత్రమే పాస్ కాగా, 51 శాతం మంది ఫెయిలయ్యారు. ఈ ఏడాది కూడా ఉత్తీర్ణత శాతం తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ మంచి ఫలితాలే వచ్చాయి.
కలర్ ప్రింట్లో షార్ట్ మెమోలు
ఇంటర్ విద్యార్థుల పాస్ మెమోలను కలర్ప్రింట్లో ఇవ్వనున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే ఈ మెమోలను ఇంటర్బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ మెమోలను డిగ్రీ, ఎంసెట్ ప్రవేశాలు సహా అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రిన్సిపాళ్లు ఆన్లైన్ మెమోలను జూలై 5 నుంచి పొందవచ్చని సూచించారు. మెమోల డౌన్లోడింగ్కు ఈ ఏడాది సీజీజీ అధికారులు తొమ్మిది సర్వర్లను అందుబాటులో ఉంచారు.
ఫిర్యాదుల స్వీకరణకు డెస్క్
ఫలితాలపై సందేహాల నివృత్తికి ఇంటర్బోర్డులో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేశారు. helpdesk-ie-telangana.gov.in మెయిల్తోపాటు 040 -24601010, 040 -24655027 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థుల ఆందోళన, టెన్షన్ను దూరం చేయడం కోసం తొమ్మిది మంది క్లినికల్ సైకాలజిస్ట్ సేవలను కొనసాగిస్తున్నారు.
వచ్చే ఏడాది ఆన్స్క్రీన్ ముల్యాంకనం
వచ్చే ఏడాది నుంచి ఇంటర్ జవాబు పత్రాలను ఆన్స్క్రీన్ పద్ధతిలో దిద్దాలని ఇంటర్బోర్డు భావిస్తున్నది. ఈ తరహాలో సాంకేతిక విద్యామండలి, ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీల్లో ఆన్స్క్రీన్ ముల్యాంకనాన్ని విజయవంతంగా అమలుచేశారు. ఇంటర్లో ఈ తరహా ప్రయోగం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ముల్యాంకన క్యాంపులు నిర్వహించకుండా, జవాబుపత్రాలను స్కాన్చేసి అధ్యాపకుల వద్దకే పంపిస్తారు. వారు ముల్యాంకనం చేసి మార్కులేస్తారు.
ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కష్టపడి చదివే విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా కానివ్వబోమని పేర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ఫెయిలైన వారికి ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రెండు పూటలా జరుగుతాయి. ప్రాక్టికల్స్ జూలై 26 నుంచి 30 వరకు ఉంటాయి. విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ నెల 30 నుంచి జూలై 7 వరకు చెల్లించవచ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్, స్కాన్డ్ కాపీ కమ్ రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 నుంచి జూలై 6 వరకు ఫీజు చెల్లించవచ్చు.