నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఆయకట్టులో ఎండుతున్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కృష్ణా జలాలు తీసుకురావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు ఆశతో వరి సాగు చేశారని, ప్రస్తుతం ఆ పంట ఎండిపోయే దశలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఒక్క తడికైనా సాగునీరు ఇవ్వగలిగితే పంటను కాపాడేందుకు అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దురదృష్టవశాత్తు ప్రకృతి సహకరించక ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. బోర్లు ఎండిపోయి నల్లగొండ కష్టాల్లో ఉన్నారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి కృష్ణా జలాలను తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కోరారు. తాగునీటి ఎద్దడి రాకుండా జలాశయాల్లో తగినన్ని నీటి వనరులను అందుబాటులో ఉంచేలా చూడాలని తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్రెడ్డి పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటాడని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తామంటే పోటీకి సిద్ధమని, లేదంటే పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలిపినా వారి గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.