రంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మరో భూసేకరణ కు తెరలేపింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో 1,240 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గ్రీన్ఫీల్డ్ రే డియల్ రింగ్రోడ్డు కోసం 554 ఎకరా ల భూసేకరణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓవైపు గ్రీన్ఫీల్డ్ రేడియల్, ఇతర రోడ్లకు భూములిచ్చే ది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. గ్రామాలవారీగా అధికారులు రైతుల తో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ రైతులు భూమి ఇవ్వబోమని.. భూమి కి భూమి, ప్లాట్కు ప్లాట్ ఇస్తేనే ఆలోచిస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా భూసేకరణకే ముందుకెళ్తున్నది. రంగారెడ్డిజిల్లాలోని యాచారం మండలం కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మండలంలోని ఆమనగల్లు, ఆకుతోటపల్లి గ్రామాల్లో 554 ఎకరాలు సేకరించనున్నది.