వనపర్తి, జూలై 12: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకే అందాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో స్థానిక టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నదన్నారు. అమ్మఒడి, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివన్నారు. రైతు బీమా, రైతుబంధు పథకాలు వ్యవసాయానికి ఊతమిస్తాయని చెప్పారు. సాగునీటి రాకతో పల్లెల స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సమస్యలపై మహిళలకే అవగాహన ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా తోడ్పాటునందించాలని వివరించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.