హైదరాబాద్: రాష్ట్రంలోని దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకుగాను మొత్తం రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.