హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : ఓ వైపు ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల జోరు నడుస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పోస్టులను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, లెక్చరర్లు సహా రాష్ట్రంలోని 59 కళాశాలల్లో 1,586 ఖాళీలు(41శాతం) ఉండగా రెండున్నరేండ్ల నుంచి ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా నింపలేదు. సీట్ల ఎంపిక విషయంలో విద్యార్థులంతా ప్రైవేట్ను కాదని సర్కార్ కళాశాలలకు జైకొడుతుంటే, ప్రభుత్వ పట్టింపులేమితో 25శాతం బోధన, 55శాతం బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. రెగ్యులర్తో పాటు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు కూడా ఖాళీగా ఉండటం గమనార్హం.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల మంచి డిమాండ్ ఉన్నది. రాష్ట్రంలో 128 పాలిటెక్నిక్ కాలేజీలుండగా, 59 ప్రభుత్వ, 67 ప్రైవేట్, రెండు ఎయిడెడ్ కళాశాలలున్నాయి. సీట్ల భర్తీని పరిశీలిస్తే 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కువగా సీట్లు నిండాయి. సర్కార్ కాలేజీల్లో 14,322 సీట్లుంటే 11,267 సీట్లు నిండాయి. అదే ప్రైవేట్ కాలేజీలో 14,640 సీట్లకు 8,464 సీట్లు మాత్రమే నిండాలి. ప్రభుత్వ కాలేజీల్లో 21శాతం సీట్లు మాత్రమే ఖాళీగా ఉండగా, అదే ప్రైవేట్లో 42శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. పరిస్థితులిలా ఉంటే కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది కొరత సమస్య వేధిస్తుండటం గమనార్హం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.
