హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు చేపట్టాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర మత్స్యరంగానికి అశనిపాతంగా మారనుంది. సర్కారు నిర్ణయం కార్యరూపం దాల్చితే మత్స్యరంగంపై అది పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే జలాశయాల్లో చేపల పెంపకాన్ని నిషేధిస్తే ఉపాధి కరువై మత్స్యకారుల జీవితాలు దుర్భరంగా మారే ప్రమాదం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సంస్థ (రెడ్కో) ఆధ్వర్యంలో అమలవుతున్న విద్యుత్తు తయారీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో సుమారు 130 వరకు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో చేపల పెంపకం ద్వారా సుమారు రెండున్నర లక్షలమంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ రిజర్వాయర్లపై ప్రభుత్వం కనుక ఫ్లోటింగ్ సోలార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిలో చేపల పెంపకాన్ని నిషేధిస్తారు. ఒకవేళ అందులో చేపలు పెరిగినా వేటను మాత్రం నిషేధిస్తారు. ఫలితంగా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుంది. ఎన్టీపీసీ రిజర్వాయర్లో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అందులో చేపల వేటను నిషేధించారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లోనూ సోలార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే పూర్తిగా ఉపాధికి దూరం కావాల్సి వస్తుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లోటింగ్ సోలార్ కేంద్రాల ఏర్పాటు వల్ల మత్స్య సంపదతోపాటు ఇతర జలరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. సోలార్ ఫలకలు అడ్డుకోవడంతో సూర్యకిరణాల నీటిలోకి చొచ్చుకొనిపోవు. ఫలితంగా చేపల ఎదుగుదల నిలిచిపోతుంది. అంతేకాదు, అక్సిజన్ ఉత్పత్తి కూడా నిలిచిపోయి జలచరాల మనుగడకు ముప్పువాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.