కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): 2 లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీ జిల్లాల్లో రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదని, ఇందుకు కారణమైన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. ఈనెల 31లోగా రుణ మాఫీ చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ బిడ్డ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక చొరవ తీసుకొని రైతులందరికీ వెంటనే రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. ఈ ఆందోళనలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొరెంగ మాలశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి మాడవి గణపతి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, టీఏజీఎస్ నాయకులు మరప హన్మంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.