మేడ్చల్, మే9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద చేయూతనిస్తూ దళితులను అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు కీసర మండలం చీర్యాల్లో జయమోహన్ గార్డెన్లో సోమవారం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ. వివేకానంద్, బేతీ సుభాశ్రెడ్డిలు వాహనాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కలలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందిన్నారు. దళితబంధు పథకంతో దళితుల కుటుంబాలలో వెలుగులు నిండుతాయని అన్నారు.
దళితులతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. దళితబంధు పథకాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సామాజికంగా, ఎదగాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.