హైదరాబాద్ : హైదరాబాద్లోని సిటీ కాలేజీ పూర్వ వైభవానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిటీ కళాశాల, తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శత వసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక విద్యా సంస్థ వస్తే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. విద్య గొప్ప మార్పులకు, వెలుగులకు కారణం అవుతుంది. ఇందుకు సిటీ కాలేజీ ఒక నిదర్శనం అన్నారు. వందేళ్ల కింద నిజాం స్థాపించిన ఈ కాలేజీ నుంచి ఎంతోమంది మేధావులు, విద్యావంతులు వచ్చారు.
వారు విద్య, రాజకీయ, పరిశోధన వంటి అనేక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరారు. సిటీ కాలేజీ చదువుకు మాత్రమే కాదు.. సామాజిక ఉద్యమాలకు వేదిక అని పేర్కొన్నారు. జయశంకర్ సార్ తరచూ సిటీ కాలేజీ గురించి చెప్పేవారు. కాలేజీలో రూ.8కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణం ప్రభుత్వం చేస్తున్నది.
వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవన పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.