హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ పోస్టుల పునర్వ్యవస్థీకరణను విద్యాశాఖ పూర్తిచేసింది. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టుతోపాటు అధ్యాపక పోస్టులను మల్టీజోన్లో చేర్చింది. మిగిలిన అన్ని రకాల ఉపాధ్యాయుల పోస్టులను జిల్లా క్యాడర్లోనే కొనసాగిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ శుక్రవారం మూడు జీవోలు జారీచేశారు. పాఠశాలల్లోని బోధనా పోస్టులను జిల్లా క్యాడర్లో, కళాశాలల్లోని బోధనా పోస్టులను మల్టీ జోనల్ క్యాడర్లో చేర్చారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు వేర్వేరు క్యాడర్లను కేటాయించారు. గతంలో వీరందరికీ ఏకీకృత సర్వీసు రూల్స్ను అమలుచేస్త్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో-124ను హై కోర్టు కొట్టేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. హైకోర్టు తుది తీర్పు వచ్చాక ఆ మేరకు ఉత్తర్వులను మారుస్తామని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. కొత్త జిల్లాలు, జోనల్ విధానానికి అనుగుణంగా విద్యాశాఖ మినహా అన్నిశాఖల్లో పోస్టులను ప్రభుత్వం గత నెలలోనే పునర్వ్యవస్థీకరించింది.